తిరుపతి / దేవుని కడప, ఆగస్టు 25, 2026: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు భక్తిశ్రద్ధలతో, ఆగమ సంప్రదాయాల ప్రకారం కొనసాగుతున్నాయి.
క్రతువుల్లో భాగంగా మంగళవారం వేద మంత్రోచ్ఛారణల నడుమ ఉత్తమోత్తమ కలశ స్నపనం నిర్వహించారు.
473 కలశాల పవిత్ర జలాలతో అభిషేకం
మొత్తం 473 పవిత్ర కలశాలను జలాలతో సంప్రోక్షించి, ఆ పవిత్ర జలాలతో మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు.
ఆలయ పవిత్రత, దైవశక్తి మరింత పెరగాలని, శ్రీనివాసుడి అనుగ్రహం అందరిపై ఉండాలని అర్చకులు ప్రార్థిస్తూ ఈ క్రతువును నిర్వహించారు.
అంతకుముందు ఆగమ సంప్రదాయాల ప్రకారం చతుష్ఠానార్చన, మూర్తి హోమం, అష్టబంధనం నిర్వహించారు.
సాయంత్రం శయాధివాసం, తత్త్వ హోమాలు, శాంతి హోమం, సత్తుమొర నిర్వహించనున్నారు.
ఆగస్టు 26న మహాసంప్రోక్షణం
ఆగస్టు 26న ఉదయం 7 గంటల నుంచి చతుష్ఠానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించనున్నారు.
అనంతరం ఉదయం 9:45 గంటల నుంచి 11:30 గంటల వరకు మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణం, కలాకర్షణం నిర్వహించనున్నారు.
ఈ పవిత్ర క్రతువులు శ్రవణ నక్షత్రం, తులా లగ్నంలో నిర్వహించనున్నారు.
మహాసంప్రోక్షణం అనంతరం భక్తులకు దర్శనం
మహాసంప్రోక్షణ క్రతువులు పూర్తయిన అనంతరం భక్తులకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి అనుమతి కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు