తిరుమల, ఆగస్టు 14, 2026: పేదలు, అవసరమైన వారికి వైద్య సహాయం అందించేందుకు టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి మాజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు కుటుంబం రూ.20 లక్షలు విరాళంగా అందించింది.
మనవళ్లు చెరో రూ.10 లక్షల విరాళం
సమాజ సేవ చేయాలన్న డా. కోడెల శివప్రసాదరావు ఆశయానికి నివాళిగా ఆయన మనవళ్లు కోడెల గౌతమ్, కోడెల జయ ఆదిత్య చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
శుక్రవారం తిరుమలలోని టీటీడీ ఈవో కార్యాలయంలో డా. కోడెల శివరామకృష్ణ ఈ విరాళానికి సంబంధించిన డీడీలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు అందజేశారు.
పేదలకు వైద్య సేవలకు మద్దతు
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ద్వారా పేదలు, అవసరమైన వారికి వైద్య సహాయం అందించేందుకు కోడెల కుటుంబం అందించిన సహకారాన్ని టీటీడీ ఈవో అభినందించారు.
టీటీడీ నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు భక్తులు, దాతలు మరింతగా సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. దీనివల్ల అవసరమైన వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
💬 వ్యాఖ్యలు