తిరుపతి, 2026 మే 28: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య శుభ మిధున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు.
ధ్వజస్తంభం వద్ద విశేష పూజలు, భేరితాడనం, ధ్వజపటం, ఆస్థానం వంటి కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, వివిధ పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించి విశేషారాధనలు చేపట్టారు.
సాయంత్రం ఊంజల్సేవ భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తగా, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ వైభవంగా జరగనుంది.
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వాహన సేవలు
మే 28 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
మే 29 – చిన్నశేష వాహనం, హంస వాహనం
మే 30 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం
మే 31 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
జూన్ 1 – మోహినీ అవతారం, గరుడ వాహనం
జూన్ 2 – హనుమంత వాహనం, గజ వాహనం
జూన్ 3 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
జూన్ 4 – రథోత్సవం, అశ్వవాహనం, శ్రీ స్వామివారి కల్యాణోత్సవం
జూన్ 5 – చక్రస్నానం, ధ్వజావరోహణం
జూన్ 4న శ్రీ స్వామివారి కల్యాణోత్సవం
జూన్ 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు నిర్వహించే శ్రీ స్వామివారి కల్యాణోత్సవానికి టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. విచ్చేసే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల పంపిణీకి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండ్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, డీఈ శ్రీ భాస్కర్, అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
💬 వ్యాఖ్యలు