తిరుపతి, ఆగస్టు 25, 2026: తోండమాన్పురంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల వార్షిక పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు.
ఆగస్టు 26న పవిత్ర ప్రతిష్ఠ
ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 26న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం యాగశాలలో వేదక్రతువులు నిర్వహిస్తారు.
ఆగస్టు 27న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్ఠానార్చన నిర్వహించనున్నారు.
ఆగస్టు 28న మహా పూర్ణాహుతితో ముగింపు
ఆగస్టు 28న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు.
సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఆలయ పవిత్రత పరిరక్షణకు పవిత్రోత్సవాలు
ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.
భక్తులు లేదా ఆలయ సిబ్బంది వల్ల పూజా కార్యక్రమాల్లో అనుకోకుండా జరిగిన లోపాలు, పొరపాట్లను పరిహరించి ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ పవిత్ర క్రతువులను నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన ప్రకాశ్, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ అనిల్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు