తిరుపతి, జూలై 18, 2026: టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలకు ఇటీవల విరాళంగా వచ్చిన తొమ్మిదేళ్ల మగ గుర్రం శనివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ విషయాన్ని ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఎ.వి.ఎన్. శివకుమార్ వెల్లడించారు. గుర్రం మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించి, అవసరమైన నమూనాలను ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు.
క్వారంటైన్లో ఉంచి ప్రత్యేక వైద్యం
జూలై 13న గోశాలకు చేరుకున్న వెంటనే గుర్రాన్ని క్వారంటైన్లో ఉంచారు.
రక్తం, మల నమూనాలను రాష్ట్ర పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల, తిరుపతికు పంపగా, ప్రాథమిక పరీక్షల్లో గుర్రం దీర్ఘకాలిక కాలేయ (లివర్), మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది.
గుర్రంలో కనిపించిన లక్షణాలు:
- ఆహారం, నీరు తక్కువగా తీసుకోవడం
- తరచూ కూర్చోవడం, పడుకోవడం
- నేలపై పొర్లడం
- నిలబడటంలో ఇబ్బంది పడడం
పశువైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు.
పోస్టుమార్టంలో ప్రాథమికంగా వెల్లడైన అంశాలు
చికిత్స ఫలించక జూలై 18 ఉదయం 10 గంటలకు గుర్రం మృతి చెందింది.
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంకు చెందిన నిపుణుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది.
ప్రాథమిక నివేదికలో గుర్రం దీర్ఘకాలిక కాలేయం, గుండె, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. తుది ప్రయోగశాల నివేదిక అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని ప్రకటించనున్నారు.
మధురైకు చెందిన గుర్రం దాత శ్రీ వడివేలు ముగంధన్ అదే రోజు గోశాలను సందర్శించి, గుర్రం మృతి చెందిన సమయంలో అక్కడే ఉన్నారు.
పోస్టుమార్టం అనంతరం నిర్దేశిత పశువైద్య విధానాల ప్రకారం గుర్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
💬 వ్యాఖ్యలు