తిరుమల, ఆగస్టు 20, 2026: తిరుమల చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను రియల్టైమ్లో పర్యవేక్షించడంతో పాటు భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు టీటీడీ ఆధునిక రోబోటిక్ టెక్నాలజీ వినియోగంపై పరిశీలన చేస్తోంది.
గురువారం టీటీడీ అదనపు ఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో క్వాడ్రుపెడ్ రోబోట్ (రోబోటిక్ డాగ్) పనితీరును పరిశీలించారు.
కఠినమైన ప్రాంతాల్లో నిఘాకు రోబోటిక్ డాగ్
మనుషులు సులభంగా చేరుకోలేని కఠినమైన, ప్రమాదకరమైన అటవీ ప్రాంతాల్లో నిఘా నిర్వహించేందుకు ఈ రోబోట్ ఎంతవరకు ఉపయోగపడుతుందనే అంశాన్ని అధికారులు పరిశీలించారు.
ఈ రోబోటిక్ డాగ్లో ఆప్టికల్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, 360 డిగ్రీల లైడార్, పలు సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి.
వీటి ద్వారా చీకటి, పొగమంచు వంటి తక్కువ దృశ్యమానత పరిస్థితుల్లో కూడా వన్యప్రాణులను గుర్తించి వాటి కదలికలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
వన్యప్రాణులు, మనుషులు, వాహనాలను గుర్తించే ఏఐ వ్యవస్థ
ఈ రోబోట్లోని ఏఐ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పెంపుడు జంతువులను గుర్తించి వర్గీకరించగలదు.
వన్యప్రాణుల కదలిక గుర్తించిన వెంటనే జియో-ట్యాగ్డ్ అలర్ట్లను పంపడంతో పాటు, ప్రత్యక్ష వీడియో, థర్మల్ ఫీడ్ను కంట్రోల్ రూమ్, గస్తీ సిబ్బందికి పంపే సామర్థ్యం ఉంది.
దీంతో పరిస్థితిని వేగంగా అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అలిపిరి–తిరుమల కాలిబాటపై ప్రత్యేక దృష్టి
అలిపిరి–తిరుమల కాలిబాటకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పరిశీలిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించడం ద్వారా భక్తులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన సమయంలో అటవీ, విజిలెన్స్, భద్రతా బృందాలను వేగంగా రంగంలోకి దించే అవకాశం ఉంటుంది.
వన్యప్రాణులను దూరంగా పంపేందుకు సౌండ్, లైట్ వ్యవస్థ
వన్యప్రాణులతో ప్రత్యక్షంగా తలపడకుండా వాటిని భక్తుల ప్రాంతాల నుంచి దూరంగా ఉంచేందుకు రోబోట్లోని శబ్ద, కాంతి వ్యవస్థలను ఉపయోగించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలించారు.
దీంతో మనిషి–వన్యప్రాణి ప్రత్యక్ష ఘర్షణను తగ్గించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుత నిఘా వ్యవస్థలకు అదనపు బలం
ఈ రోబోట్ ప్రస్తుతం ఉన్న కెమెరా ట్రాప్స్, ఫుట్ పెట్రోలింగ్, అటవీ నిఘా వ్యవస్థలకు ప్రత్యామ్నాయం కాదని, వాటికి అదనపు బలంగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
వన్యప్రాణుల కదలికలు అధికంగా ఉన్న ప్రాంతాలకు అవసరాన్ని బట్టి దీనిని మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా వేగంగా తరలించి వినియోగించే అవకాశం ఉంటుంది.
వన్యప్రాణుల కదలికలపై మరింత సమాచారం
రోబోట్ ద్వారా సేకరించే వీడియో, థర్మల్ చిత్రాలు, కదలికల డేటాను విశ్లేషించడం ద్వారా వన్యప్రాణుల కదలికల నమూనాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు.
దీని ఆధారంగా తిరుమలలోని కీలక అటవీ ప్రాంతాల్లో గస్తీ షెడ్యూల్, నిఘా బృందాల మోహరింపును మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
💬 వ్యాఖ్యలు