తిరుపతి / దేవుని కడప / వొంటిమిట్ట, ఆగస్టు 19, 2026: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగమ శాస్త్రోక్తంగా ఆగస్టు 23 నుంచి 26వ తేదీ వరకు అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు.
బుధవారం ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించి, అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంజినీరింగ్, విద్యుత్ పనులు సకాలంలో పూర్తి చేయాలి
ఆలయంలో జరుగుతున్న ఇంజినీరింగ్, విద్యుత్ పనులను సకాలంలో పూర్తి చేయాలని జేఈవో అధికారులను ఆదేశించారు.
అలాగే ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించాలని, ధ్వజస్తంభం, బలిపీఠానికి ఇత్తడి రేకుల పనులను ఆగస్టు 21లోగా పూర్తి చేయాలని సూచించారు.
భక్తులకు సౌకర్యవంతమైన, ఎలాంటి ఇబ్బందులు లేని దర్శన అనుభవం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఆలయానికి చేరుకున్న జేఈవోకు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేసి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
వొంటిమిట్ట ఆలయంలో ఏర్పాట్ల పరిశీలన
అనంతరం డా. శరత్ వొంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని సందర్శించి భక్తులకు కల్పిస్తున్న క్యూలైన్లు, వంటశాల, యాగశాల, ప్రసాదం పంపిణీ, ఇతర వసతులను పరిశీలించారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
100 గదుల వసతి సముదాయం నిర్మాణానికి ప్రతిపాదిత స్థలం పరిశీలన
టీటీడీ నిర్మించనున్న 100 గదుల వసతి సముదాయానికి ప్రతిపాదించిన స్థలాన్ని కూడా జేఈవో పరిశీలించారు.
అలాగే కల్యాణ వేదిక సమీపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో టీటీడీ సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఈఈ శ్రీమతి సుమతి, డిప్యూటీ ఈఈ శ్రీ నాగరాజు, ఆలయ ఏఈవో శ్రీ ఎన్. రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్లు శ్రీ ఈశ్వర్ రెడ్డి, శ్రీ మోహన్ బాబు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు