తిరుమల, ఆగస్టు 14, 2026: రానున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం తిరుమలలోని సుధర్మ కాన్ఫరెన్స్ హాల్లో పారిశుద్ధ్య ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యతా ప్రమాణాల మెరుగుదల, అవసరమైన సామగ్రి కొనుగోలు, ఆధునిక పరికరాల వినియోగం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ‘నందకం’ యాప్
క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ‘నందకం’ పేరుతో ఫిర్యాదుల నిర్వహణ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.
ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్య సమస్యలను రియల్టైమ్లో నమోదు చేయడం, సంబంధిత సిబ్బందికి ఆటోమేటిక్గా సమాచారం చేరవేయడం, సమస్య పరిష్కార పురోగతిని ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.
వచ్చే నెలలో నందకం యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్లు, అలిపిరి కాలిబాటలో ప్రత్యేక దృష్టి
తిరుమలలోని ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్ల మార్గం, అలిపిరి కాలిబాట, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలను మరింత విస్తరించనున్నారు.
‘మన ఊరు – మన గుడి’ కార్యక్రమంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, బృందాలు అందిస్తున్న సహకారాన్ని అదనపు ఈవో అభినందించారు.
ఆలయ పరిధికి వెలుపల కూడా ఈ బృందాలు తమ సహకారాన్ని కొనసాగించడాన్ని స్వాగతించారు. ఇలాంటి సామాజిక భాగస్వామ్య కార్యక్రమాల వల్ల భక్తుల నుంచి పారిశుద్ధ్యంపై మెరుగైన అభిప్రాయాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.
తిరుమల పరిశుభ్రతలో భక్తులు కూడా భాగస్వాములు కావాలి
తిరుమల పరిశుభ్రత, పవిత్రతను కాపాడటంలో ప్రతి భక్తుడు బాధ్యత తీసుకోవాలని అదనపు ఈవో విజ్ఞప్తి చేశారు.
వాహనాల నుంచి చెత్తను బయటకు వేయకూడదని, తిరుమల ఆలయ పరిసరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఉపయోగించకూడదని సూచించారు.
తిరుమల కొండను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి భక్తులు సహకరించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఈవో హెల్త్ శ్రీ సోమనారాయణ, పారిశుద్ధ్య విభాగం అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు