తిరుపతి, జూలై 9, 2026: టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయాల్లో జూలై 17న వార్షిక అనివార ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
తమిళ మాసమైన ఆణి నెల చివరి రోజున నిర్వహించే ఈ అనివార ఆస్థానం, మహంతుల కాలంలో ఆలయ వార్షిక లెక్కలు, పరిపాలన ప్రారంభాన్ని సూచించే సంప్రదాయ ఉత్సవంగా కొనసాగుతోంది.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో
ఈ ఆలయంలో అనివార ఆస్థానం సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు బంగారు వాకిలి వద్ద నిర్వహిస్తారు.
శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆస్థానంలో కొలువుదీరుతారు.
శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి కొత్త పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించడం ప్రత్యేక సంప్రదాయం.
శ్రీ కోదండరామస్వామి ఆలయంలో
సాయంత్రం 4.00 గంటల నుంచి 5.00 గంటల వరకు గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీ కోదండరామస్వామివారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు అనివార ఆస్థానం నిర్వహిస్తారు.
అనంతరం మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలను సంప్రదాయబద్ధంగా సమర్పిస్తారు.
జీయర్ స్వాములు, అధికారులు పాల్గొననున్నారు
ఈ పవిత్ర కార్యక్రమంలో తిరుమల జీయర్ స్వాములు, ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొంటారు.
ఈ విశిష్ట వార్షిక ఉత్సవంలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కోదండరామస్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని టీటీడీ భక్తులను కోరింది.
💬 వ్యాఖ్యలు